Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 8th కరెంట్‌ అఫైర్స్‌





Standing Finance Committee: కృష్ణా నదిపై రెండంతస్తుల కేబుల్‌ బ్రిడ్జి

దేశంలోనే తొలిసారి రెండు అంతస్తుల కేబుల్‌ వంతెన రాష్ట్రంలో నిర్మాణం కాబోతోంది. కృష్ణానదిపై సోమశిల వద్ద ప్రతిపాదించిన భారీ బ్రిడ్జికి కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ అధీనంలోని స్టాండింగ్‌ ఫైనాన్స్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది. అక్టోబర్ 7న ఢిల్లీలో ఈ కమిటీ భేటీ అయ్యింది. నిర్మాణ సంస్థకు వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చిన రెండేళ్ల కాలంలో ఇది సిద్ధం కానుంది. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ కృష్ణా నదిపై నిర్మించే ఈ వంతెనలో పైన వాహనాలు వెళ్లే ప్రధాన క్యారేజ్‌ వే ఉంటుంది. దాని దిగువన పర్యాటకులు నడుచుకుంటూ సోమశిల ప్రకృతి సౌందర్యం, కృష్ణా నదీ పరవళ్లను తిలకించేందుకు వీలుగా గాజు వంతెన (పెడస్ట్రియన్‌ డెక్‌) ఉంటుంది.


అక్కడ ఎందుకు..?
తెలంగాణ నుంచి ఏపీలోని నంద్యాల వైపు రోడ్డు మార్గాన వెళ్లేవారికి దూరాభారాన్ని తగ్గించే క్రమంలో కొత్త జాతీయ రహదారిని ప్రతిపాదించారు. నంద్యాల, తిరుపతి వెళ్లాలంటే కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అదే కొల్లాపూర్‌ మీదుగా కృష్ణా నదిని దాటేలా వంతెన నిర్మిస్తే ఆ దూరం దాదాపు 90 కి.మీ మేర తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌–శ్రీశైలం రహదారి మీద ఉన్న కోట్రా జంక్షన్‌ నుంచి మల్లేశ్వరం, అక్కడి నుంచి నంద్యాల వరకు 173.73 కి.మీ మేర రహదారిని (హైవే 167 కే) నాలుగు వరసలుగా నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు కృష్ణానదిపై వంతెన అవసరమైంది. అయితే దీన్ని సాదాసీదాగా నిర్మించకుండా, పర్యాటకులను ఆకట్టుకునేలా ఐకానిక్‌ వంతెనగా నిర్మిస్తే బాగుంటుందని అధికారులు ప్రతిపాదించారు. పాపికొండలు తరహాలో ఈ ప్రాంతం అత్యంత రమణీయంగా ఉన్నందున ఇక్కడికి నిత్యం వేలల్లో పర్యాటకులు వస్తారు. గాజు నడక వంతెన నిర్మిస్తే వారు నదీ పరవళ్లను తిలకిస్తూ ప్రత్యేక అనుభూతిని పొందేందుకు అవకాశం ఉంటుందని భావించారు. వాహనాల వంతెన దిగువన గాజు డెక్‌ ఉండేలా రెండంతస్తులుగా డిజైన్‌ చేశారు.

Nobel Peace Prize 2022: మానవ హక్కుల పోరాటాలకు నోబెల్‌ శాంతి బహుమతి



మానవ హక్కుల పరిరక్షణ కోసం కొనసాగుతున్న ఉద్యమాలకు నోబెల్‌ కమిటీ అత్యున్నత గౌరవాన్ని కల్పించింది. బెలారస్‌ మానవ హక్కుల ఉద్యమకారుడు అలెస్‌ బియాల్‌యాస్కీ(60), రష్యా మానవ హక్కుల సంస్థ ‘మెమోరియల్‌’, ఉక్రెయిన్‌ సంస్థ ‘సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌’కు సంయుక్తంగా 2022 సంవత్సరానికి గాను నోబెల్‌ శాంతి బహుమతిని అక్టోబర్ 7న ప్రకటించింది.
రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రెండు దేశాల్లోని సంస్థలు ప్రపంచ ప్రతిష్టాత్మక బహుమానానికి ఎంపిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్‌పై దండెత్తుతున్న రష్యా అధినేత పుతిన్‌ ఏకపక్ష వైఖరిపై ఇదొక నిరసన అని నిపుణులు అంచనా వేస్తున్నారు. బెలారస్, రష్యా, ఉక్రెయిన్‌లో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, శాంతియుత సహజీవనం వంటి అంశాల్లో గొప్ప చాంపియన్లు అయిన ముగ్గురిని (ఒక వ్యక్తి, రెండు సంస్థలు) శాంతి బహుమతితో గౌరవిస్తుండడం ఆనందంగా ఉందని నార్వే నోబెల్‌ కమిటీ చైర్మన్‌ బెరిట్‌ రీస్‌–ఆండర్సన్‌ చెప్పారు. ఆమె మీడియాతో మాట్లాడారు. వారంతా సైనిక చర్యలను వ్యతిరేకిస్తూ మానవీయ విలువలు, న్యాయ సూత్రాల రక్షణ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశాల మధ్య శాంతి, సౌభ్రాతృత్వం వర్థిల్లాలని ఆల్ఫెడ్‌ నోబెల్‌ ఆకాంక్షించారని గుర్తుచేశారు.


గత ఏడాది(2021) నోబెల్‌ శాంతి బహుమతిని సంయుక్తంగా అందుకున్న రష్యా జర్నలిస్టు దిమిత్రీ మురతోవ్, ఫిలిప్పైన్స్‌ జర్నలిస్టు మారియా రెస్సా


అంకితభావం గల ఉద్యమకారుడు అలెస్‌ బియాల్‌యాస్కీ నేటి రష్యాలోని వెర్సైసిల్లాలో 1962 సెప్టెంబర్ 25వ తేదీన జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం బెలారస్‌కు వలస వెళ్లింది. విద్యాభ్యాసం అనంతరం బియాల్‌యాస్కీ కొంతకాలంపాటు పాఠశాల ఉపాధ్యాయుడిగా, తర్వాత సైన్యంలో డ్రైవర్‌గా పనిచేశారు. 1980వ దశకం నుంచి బెలారస్‌లో ఆయన మానవ హక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 1996లో ‘వియాస్నా హ్యూమన్‌ రైట్స్‌ సెంటర్‌’ అనే ప్రభుత్వేతర సంస్థను స్థాపించారు. అంకితభావం కలిగిన మానవ హక్కుల, పౌరస్వేచ్ఛ, ప్రజాస్వామ్య ఉద్యమకారుడిగా ప్రజల్లో గుర్తింపు పొందారు. ఎన్నో పోరాటాలను ముందుండి నడిపించారు. హవెల్స్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ అవార్డును 2013లో, నోబెల్‌కు ప్రత్యామ్నాయంగా భావించే రైట్‌ లైవ్లీ హుడ్‌ అవార్డును 2020లో గెలుచుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు సారథ్యం వహిస్తున్న బియాల్‌యాస్కీని పన్నులు ఎగవేశారన్న కారణంతో బెలారస్‌ పాలకులు 2021 జూలై 14న నిర్బంధించారు. ఆయన ప్రస్తుతం ఎలాంటి విచారణ లేకుండా జైలులో మగ్గుతున్నారు. ఆయనను విడుదల చేయాలంటూ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నా పాలకులు లెక్కచేయడం లేదు. ఎన్నో అవరోధాలు, బెదిరింపులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నమ్మిన సిద్ధాంతానికి బియాల్‌యాస్కీ కట్టుబడి ఉండడం విశేషం.

యుద్ధంపై ఎక్కుపెట్టిన ఆయుధం
ఉక్రెయిన్‌లోని కొందరు శాంతి కాముకులు 2007లో ‘సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌’ను ఏర్పాటు చేశారు. అప్పట్లో దేశంలో అశాంతి రగులుతున్న తరుణంలో మానవ హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య ఉద్యమాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు. ఉక్రెయిన్‌ పౌర సమాజాన్ని బలోపేతం తదితరాలు సంస్థ ముఖ్య లక్ష్యాలు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత ఈ సంస్థ మరింత క్రియాశీలకంగా పనిచేస్తోంది. సాధారణ ప్రజలపై రష్యా యుద్ధ నేరాలను రికార్డు చేసి, ప్రపంచానికి తెలియజేస్తోంది. ఈ యుద్ధ నేరాలకు రష్యాను జవాబుదారీగా మార్చేందుకు కృషి చేస్తోంది. యుద్ధానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన అసలైన ఆయుధం మానవ హక్కుల పోరాటమేనని ‘సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌’ చెబుతోంది.

సైనిక చర్యలకు వ్యతిరేకంగా పోరాటం
‘మెమోరియల్‌’ సంస్థ 1989 జనవరి 28న అప్పటి సోవియట్‌ యూనియన్‌ చివరిదశలో ఉన్న సమయంలో ఏర్పాటైంది. ప్రధానంగా ఇది న్యాయ సేవా సంస్థ. కమ్యూనిస్టు పాలకుల అణచివేత చర్యల వల్ల ఇబ్బందులు పడుతున్నవారికి అండగా నిలిచింది. రష్యాలో మానవ హక్కుల విధ్వంసంపై, రాజకీయ ఖైదీల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోంది. సైనిక చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ‘మెమోరియల్‌’ ప్రధాన కార్యాలయం రష్యా రాజధాని మాస్కోలో ఉంది. సంస్థ బోర్డు చైర్మన్‌గా యాన్‌ రచిన్‌స్కీ వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో ఈ సంస్థను ఈ ఏడాది ఏప్రిల్‌ 5న రష్యా ప్రభుత్వం మూసివేసింది. అయినప్పటికీ ‘మెమోరియల్‌’ కార్యకలాపాలు అనధికారికంగా కొనసాగుతూనే ఉండటం విశేషం.

Virtual Conference on Industry 4.0: నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్‌ సారథ్యం వహించగలదని ధీమా వ్యక్తంచేసిన ప్రధాని మోదీ



ప్రపంచ నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని భారత్‌ ముందుండి నడిపించగలదని, ఆ సామర్థ్యం భారత్‌ సొంతమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని కేవడియాలో జరుగుతున్న ఇండస్ట్రీ 4.0 అనే సదస్సునుద్దేశిస్తూ ప్రధాని మోదీ వర్చువల్‌గా ఒక సందేశం పంపారు. అందులోని సారాంశం ఆయన మాటల్లోనే.. ‘ అధునాతన సాంకేతికత ఆలంబనగా నాలుగో పారిశ్రామిక విప్లవం మొదలవ్వాలి. సృజనాత్మక ఆలోచనలతోనే ఇది సాధ్యం. వేర్వేరు కారణాల వల్ల గత పారిశ్రామిక విప్లవాల్లో భారత్‌ భాగస్వామి కాలేకపోయింది. ఇండస్ట్రీ 4.0కు సారథ్యం వహించే సుధృఢ లక్షణాలు దేశానికి ఉన్నాయి. యువజనాభా, డిమాండ్, స్వేచ్ఛాయుత వాణిజ్యానికి బాటలుపరిచే కేంద్ర ప్రభుత్వం సమష్టిగా దీన్ని సుసాధ్యంచేయగలవు. ప్రపంచ వస్తు గొలుసు వ్యవస్థలో భారత్‌ కీలక భూమిక పోషించేలా చేయగల సమర్థత దేశీయ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలకు ఉంది. ఇందుకోసం సంస్కరణలు తెస్తూ, రాయితీల తోడ్పాటు అందిస్తూ అధునాతన సాంకేతికతను సంతరించుకున్న ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషిచేస్తున్నాం’ అని ప్రధాని మోదీ అన్నారు.
‘3డీ ప్రింటింగ్, మెషీన్‌ లెర్నింగ్, డేటా అనలైటిక్స్, ఎల్‌ఓటీ వంటి రంగాల్లో పారిశ్రామికాభివృద్ధితో ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ వృద్ధిచెందుతోంది’ అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే కార్యక్రమంలో అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గుజరాత్‌ కోసం 75 , కర్ణాటక కోసం 100 ఈవీ బస్సులను ప్రారంభించారు. పుణెలోని ఇండస్ట్రీ 4.0(సీ4ఐ4) ల్యాబ్‌నూ మొదలుపెట్టారు. స్మార్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌పై భారీ పరిశ్రమల శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది.

NASA: 5 నిమిషాల్లో ఎలక్ట్రిక్‌ కారు చార్జ్‌!


భవిష్యత్‌ అంతరిక్ష ప్రయోగాలకు ఉద్దేశించిన ఒక అధునాతన సాంకేతికత సాయంతో విద్యుత్‌ కారును కేవలం ఐదు నిమిషాల్లో ఫుల్‌ చార్జ్‌ చేయొచ్చని నాసా ఆర్థికసాయంతో పరిశోధన చేసిన ఒక అధ్యయన బృందం ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలో రోడ్డు వెంట ఉన్న చార్జింగ్‌ స్టేషన్‌లో దాదాపు 20 నిమిషాలు, ఇళ్లలో అయితే గంటల తరబడి విద్యుత్‌ కార్లను చార్జ్‌ చేయాల్సి వస్తోంది. దాంతో ఇప్పటికీ భారత్‌లో కొందరు విద్యుత్‌ వాహనాలకు యజమానులుగా మారేందుకు సంసిద్ధంగా లేరు. ప్రస్తుతమున్న అధునాతన చార్జర్లు 520 ఆంపియర్ల కరెంట్‌నే బదిలీచేయగలవు. వినియోగదారులకు ఎక్కువగా అందుబాటులో ఉన్న చార్జర్లు అయితే కేవలం 150 ఆంపియర్లలోపు విద్యుత్‌నే పంపిణీచేయగలవు. అయితే, నూతన ఫ్లో బాయిలింగ్, కండన్సేషన్‌ ఎక్స్‌పరిమెంట్‌తో ఇది సాధ్యమేనని అమెరికాలోని పుర్డ్యూ విశ్వవిద్యాయంలోని(Purdue University) పరిశోధకులు చెప్పారు. అయితే, 1,400 ఆంపియర్ల విద్యుత్‌ ప్రసరణ సామర్థ్యముండే చార్జింగ్‌ స్టేషన్లలో ఇది సాధ్యమేనని నాసా పేర్కొంది. ఇంతటి ఎక్కువ ఆంపియర్ల విద్యుత్‌ ప్రసరణ సమయంలో వేడి బాగా ఉద్భవిస్తుంది. దీనికి చెక్‌పెట్టేందుకు ద్రవ కూలెంట్‌ను ముందుగా చార్జింగ్‌ కేబుల్‌ గుండా పంపించారు. ఇది కరెంట్‌ను మోసుకెళ్లే కండక్టర్‌లో జనించే వేడిని లాగేస్తుంది. దీంతో 4.6 రెట్లు వేగంగా చార్జింగ్‌ చేయడం సాధ్యమైంది. కరెంట్‌ ప్రసరించేటపుడు వచ్చే 24.22 కిలోవాట్ల వేడిని ఈ విధానం ద్వారా తొలగించగలిగారు. ‘కొత్త పద్ధతి కారణంగా చార్జింగ్‌ సమయం బాగా తగ్గుతుంది. ఎక్కువ సేపు చార్జింగ్‌ జంజాటం లేదుకాబట్టి ఎక్కువ మంది ఎలక్టిక్‌ వాహనాలవైపు మొగ్గుచూపుతారు’ అని పరిశోధకులు వ్యాఖ్యానించారు. భారరహిత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఈ రెండు ఫేజ్‌ల ఫ్లూయిడ్‌ ఫ్లో, వేడి బదిలీ ప్రక్రియను పరీక్షించనున్నారు.


Digital Economy: డిజిటల్ ఎకానమీని పెంచేందుకు RBI డిజిటల్‌ రూపాయి ప్రవేశపెట్టనుంది..

దేశీ డిజిటల్‌ ఎకానమీకి మరింత ఊతమిచ్చే దిశగా డిజిటల్‌ రూపాయిని త్వరలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తేనున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. నిర్దిష్ట అవసరాల కోసం వినియోగించేలా ఈ–రూపీని పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. పేమెంట్‌ వ్యవస్థలను మరింత సమర్థమంతమైనవిగా తీర్చిదిద్దేందుకు, మనీ లాండరింగ్‌ను నిరోధించేందుకు ఇది తోడ్పడగలదని తెలిపింది. దీనికి సంబంధించి అవగాహన కల్పించేందుకు కాన్సెప్ట్‌ నోట్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ అక్టోబర్ 7న విడుదల చేసింది.
డిజిటల్‌ రూపాయి నేపథ్యం, ప్రత్యేకతలు, ఇతరత్రా విధానపరమైన అంశాలు మొదలైన వివరాలను ఇందులో పొందుపర్చింది. ‘అధునాతనమైన, సులభమైన, సమర్థమంతమైన, సురక్షితమైన పేమెంట్‌ సిస్టమ్‌ల సహకారంతో డిజిటల్‌ రూపాయి .. దేశ డిజిటల్‌ ఎకానమీకి మరింత ఊతమిస్తుంది. త్వరలో నిర్దిష్ట అవసరాల కోసం పైలట్‌ ప్రాతిపదికన దీన్ని అందుబాటులోకి తెస్తాం. క్రమంగా పరిధిని విస్తరిస్తాం. ఈ–రూపీ ప్రయోజనాలు, ఫీచర్ల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం‘ అని ఆర్‌బీఐ పేర్కొంది. ఇది వివిధ రూపాల్లో ప్రస్తుతం చలామణీలో ఉన్న నగదు, చెల్లింపు విధానాలకు అదనంగా మరో విధానం మాత్రమే తప్ప వాటి స్థానంలో ప్రవేశపెడుతున్నది కాదని స్పష్టం చేసింది.
రెండు రకాలు..
రిజర్వ్‌ బ్యాంక్‌ అధికారికంగా ప్రవేశపెట్టే సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) ప్రధానంగా రిటైల్, హోల్‌సేల్‌ అని రెండు రకాలుగా ఉండనుంది. రిటైల్‌ సీబీడీసీ సాధారణంగా ప్రజలందరూ వినియోగించుకునేందుకు ఉద్దేశించినది. హోల్‌సేల్‌ సీబీడీసీ అనేది ప్రత్యేకంగా నిర్దిష్ట ఆర్థిక సంస్థల వినియోగం కోసం ఉంటుంది. కేవలం కొన్ని దేశాలు మాత్రమే ఈ తరహా డిజిటల్‌ కరెన్సీని ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్న నేపథ్యంలో.. ద్రవ్యపరపతి విధానంపై సీబీడీసీ చూపబోయే ప్రభావాలు ప్రస్తుతానికి ఊహాజనితమైనవేనని ఆర్‌బీఐ తెలిపింది.


T20: ‘లక్నో’ జట్టు గ్లోబల్‌ మెంటార్‌గా గంభీర్‌


భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ బాధ్యతలు పెరిగాయి. రాజీవ్‌ ప్రతాప్‌ సంజీవ్‌ గోయెంకా (ఆర్‌పీఎస్‌జీ) గ్రూప్‌నకు చెందిన టి20 క్రికెట్‌ జట్లకు అతను ఇకపై గ్లోబల్‌ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను రెండుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఈ మాజీ కెప్టెన్ ను తొలుత లక్నో సూపర్‌ జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ) మార్గనిర్దేశకుడు (మెంటార్‌)గా నియమించింది. అనంతరం దక్షిణాఫ్రికా టి20 లీగ్‌లోకి ప్రవేశించిన ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌ డర్బన్‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఇప్పుడు గ్లోబల్‌ మెంటార్‌ బాధ్యతలు అప్పగించడంతో గంభీర్‌ డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌కు కూడా మార్గనిర్దేశకుడిగా ఉంటాడు. దీనిపై స్పందించిన గంభీర్‌ ‘నాపై నమ్మకంతో కట్టబెట్టిన అదనపు బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించేందుకు కృషిచేస్తా. ఆటగాళ్లకు మార్గదర్శనం చేస్తూ జట్లకు విజయాలు అందించడంపైనే దృష్టిసారిస్తా’ అని అన్నాడు.


36th National Games: వ్రిత్తి ఖాతాలో మరో పతకం

 జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల స్విమ్మింగ్‌ 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో వ్రిత్తి అగర్వాల్‌ కాంస్య పతకం సొంతం చేసుకుంది. అక్టోబర్ 7న జరిగిన ఈ విభాగంలో వ్రిత్తి 4 నిమిషాల 34.96 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. ఈ జాతీయ క్రీడల్లో వ్రిత్తికిది మూడో పతకం కావడం విశేషం.
ఇప్పటి వరకు తెలంగాణ ఏడు స్వర్ణాలు, ఏడు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం 18 పతకాలతో 14వ స్థానంలో ఉంది.


Hockey: హర్మన్‌ప్రీత్‌కు ‘ఎఫ్‌ఐహెచ్‌’ అవార్డు



భారత స్టార్‌ డిఫెండర్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ వరుసగా రెండో ఏడాది కూడా అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుకు ఎంపికయ్యాడు. అతను నిలకడైన ఆటతీరుతో ఇంటాబయటా జట్టు విజయాల్లో కీలకభూమిక పోషిస్తున్నాడు. ఈ భారత వైస్‌కెప్టెన్‌ 2021–22 ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రో లీగ్‌లో విశేషంగా రాణించాడు. 16 మ్యాచ్‌లాడిన హర్మన్‌ప్రీత్‌ 18 గోల్స్‌ చేశాడు. దీంతో ఒక సీజన్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
గతేడాది ఢాకాలో జరిగిన ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో అతని (6 మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌) ప్రదర్శన వల్లే భారత జట్టు కాంస్యం గెలిచింది. ప్రతీ మ్యాచ్‌ లోనూ గోల్‌ చేయడం విశేషం. ఈ ఏడాది బర్మింగ్‌హామ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ‘కామన్వెల్త్‌ గేమ్స్‌’లో భారత్‌ రన్నరప్‌గా నిలువడంలోనూ అతని పాత్ర ఉంది. ‘హర్మన్‌ప్రీత్‌ ఆధునిక హాకీ క్రీడలో సూపర్‌స్టార్‌. అతని డిఫెన్స్‌ అద్భుతం. ప్రత్యర్థుల రక్షణపంక్తిని బోల్తా కొట్టించడంలో అతను ఘనాపాటి. తన స్టిక్‌కు అందిన బంతిని చకచకా ఆడిస్తూ తీసుకెళ్లే సామర్థ్యం అతని సొంతం. అదే వేగంతో గోల్‌పోస్ట్‌లోకి పంపడంలోనూ హర్మన్‌ దిట్ట. అందుకే వరుసగా ఈ ఏడాది కూడా అతన్నే అవార్డు వరించింది’ అని ఎఫ్‌ఐహెచ్‌ ఒక ప్రకటనలో కొనియాడింది.
పురుషుల హాకీలో వరుసగా ఇలా అవా ర్డులు పొందిన నాలుగో ఆటగాడిగా హర్మన్‌ ఘనత వహించాడు.
గతంలో డి నూయిజెర్‌ (నెదర్లాండ్స్‌), జేమీ డ్వెయర్‌ (ఆస్ట్రేలియా), ఆర్థర్‌ వాన్‌ డొరెన్‌ (బెల్జియం)లు రెండేళ్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా నిలిచారు.
తాజా అవార్డు బరిలో ప్యానెల్‌... హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌కు 29.4 పాయింట్లు ఇవ్వగా, రేసులో ఉన్న బ్రింక్‌ మన్‌ (నెదర్లాండ్స్‌; 23.6), టామ్‌ బూన్‌ (బెల్జియం; 23.4) వెనుకబడ్డారు.


Sinare Literary Award: సుద్దాల అశోక్‌తేజకు సినారె సాహితీ పురస్కారం

సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజకు సినారె సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేయడం ఎంతో ఆనందదాయకమని పద్మభూషణ్‌ డాక్టర్‌ కేఐ వరప్రసాద్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక సౌజన్యంతో యువ కళావాహిని ఆధ్వర్యంలో అక్టోబర్ 7న రవీంద్రభారతిలో రచయిత సుద్దాల అశోక్‌ తేజకు సినారే సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు.


Telangana రాష్ట్ర ఖజానాకు మరో రూ.2,500 కోట్ల రుణాలు


ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఆరంభంలోనే రాష్ట్ర ఖజానాకు రూ.2,500 కోట్లు రుణాల రూపంలో సమకూరాయి. ఈ నెల 3న జరిగిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) వేలంలో బాండ్ల ద్వారా ఈ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం సమకూర్చుకుంది. దీంతో 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను అప్పులచిట్టా రూ.22,500 కోట్లకు చేరింది. గత రెండు త్రైమాసికాల్లో కలిపి రూ.20 వేలకోట్లను రుణాలుగా సమీకరించుకుంది. ఈ నెలలోనే మరో రూ.1,500 కోట్లను అప్పులరూపంలో తీసుకోనుంది. దీంతో ఈ నెలాఖరుకల్లా రాష్ట్ర ప్రభుత్వ అప్పులచిట్టా రూ.23,500 కోట్లకు చేరనుంది. ఇక, మూడో త్రైమాసికంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.8,500 కోట్లకుపైగా రుణాలు తీసుకోనుందని ఆర్బీఐ కేలండర్‌ చెబుతోంది. ఈ కేలండర్‌ ప్రకారం రానున్న రెండు నెలల్లో రూ.4,500 కోట్లకుపైగా రుణాలు తీసుకోనుంది. ఈ నెల 11న రూ.500 కోట్లు, 25న రూ.500 కోట్లు, నవంబర్‌ 1న రూ.1,500 కోట్లు, 15న రూ.1,000 కోట్లు, 29న రూ.500 కోట్లు, డిసెంబర్‌ 6న రూ.1,500 కోట్లు, 13న రూ.500 కోట్లను రుణం రూపంలో వేలం ద్వారా సమీకరించుకోనుంది. దీంతో మూడో త్రైమాసికం ముగిసేసరికి దాదాపు రూ.30 వేల కోట్లకు రాష్ట్ర ప్రభుత్వ అప్పులచిట్టా చేరనుంది. ఇక, మిగిలిన త్రైమాసికంలో మరో ఏడెనిమిది వేల కోట్ల రూపాయల మేర ఆర్బీఐ వేలం ద్వారా రుణాలను సమీకరించుకునే అవకాశముందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read Daily Current Affairs 7th October 2022 in Telugu

No comments:

Post a Comment