డీఎస్సీకి 12 వేలకు పైగా పోస్టులు!

ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఏటా జనవరిలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ దిశగా పాఠశాల విద్యాశాఖ తన పరిధిలోని టీచర్ పోస్టుల నియామకాలపై దృష్టి సారించింది.
Edu newsఈ మేరకు ఉపాధ్యాయ ఖాళీలు, జిల్లాల వారీ రోస్టర్ పాయింట్లు, ఇతర సాంకేతిక అంశాలతో కూడిన సమాచారాన్ని అధికారులు రప్పిస్తున్నారు. డిసెంబర్ 31 తేదీ నాటికి ఖాళీగా ఉన్న పోస్టులన్నిటినీ భర్తీచేసేలా ఏర్పాట్లు చేపట్టారు. జనవరిలో నోటిఫికేషన్లను విడుదల చేయడానికి అవసరమైన ముందస్తు ప్రక్రియలపై దృష్టి సారించామని పాఠశాల విద్యాశాఖ వర్గాలు వివరించాయి. పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు 12వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉండవచ్చని అంచనా వేస్తున్నామని, అలాగే మున్సిపల్ స్కూళ్లలో మరో 2వేల వరకు పోస్టులు ఖాళీగా ఉంటాయని, మొత్తంగా 12నుంచి 14వేల వరకు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడే అవకాశముందని పేర్కొన్నాయి. జిల్లాల వారీ డిసెంబర్ ఆఖరుకు ఉండే ఖాళీలు, ఇతర అంశాలతో కూడిన సమగ్ర సమాచారం వచ్చాకనే పోస్టులపై కచ్చితమైన గణాంకాలు తేలనున్నాయి. కాగా, ఈసారి టీచర్ పోస్టుల భర్తీకి టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్), టీచర్ రిక్రూట్‌మెంటు టెస్టు (టీఆర్టీ-డీఎస్సీ) వేర్వేరుగా నిర్వహించేలా అధికారులు సన్నాహాలు చేపట్టారు. అలాగే గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన డీఎస్సీ-2018 పలు న్యాయ వివాదాలతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. జనవరిలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్లకు ముందుగానే ఈ న్యాయవివాదాలను పరిష్కరింపచేయాలని అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. డిసెంబర్ ఆఖరుకల్లా ఈ నియామకాలు పూర్తిచేయనున్నామని వారు పేర్కొంటున్నారు.

No comments:

Post a Comment